FactCheck : Paytm ను మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? ఫిబ్రవరి 29 తర్వాత కూడా..

Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను మూసివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Feb 2024 12:45 PM GMT
FactCheck : Paytm ను మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? ఫిబ్రవరి 29 తర్వాత కూడా..

Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను మూసివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

https://www.facebook.com/reel/905854671234950

ఫిబ్రవరి 29 తర్వాత Paytm తన కార్యకలాపాలను ఆపివేస్తోందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. “RBI Paytm కంపెనీపై నిషేధం విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నిషేధంలో Paytm Wallet, Paytm bank, FastTag వంటి సేవలు కూడా నిషేధించారు. కాబట్టి, మీ స్నేహితులకు ఈ విషయాలను తెలియజేయండి. ” అంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ :

ఆ పోస్ట్ తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

ఫిబ్రవరి 1న అందుకు సంబంధించి Paytm ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది. “Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, Paytm అసోసియేట్ RBI ఆదేశాలను అందుకుంది. Paytm చెల్లింపులు, ఆర్థిక సేవల ఉత్పత్తులకు సంబంధించి ఆపివేయడం లాంటివి జరగవని" తెలిపారు.

ఫిబ్రవరి 29 తర్వాత కూడా యాప్ పని చేస్తుందని Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఫిబ్రవరి 2న ట్వీట్ చేశారు.

పేటీఎం వ్యవహారంపై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) స్పందించింది. ఈ విషయంలో వ్యవస్థాగతంగా ఎలాంటి లోపాలు లేవని.. కేవలం తరచూ నిబంధనలను ఉల్లంఘించటం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గవర్నర్‌ శక్తికాంత దాస్ తెలిపారు. నిబంధనలు అమలుచేయడానికి తగినంత సమయం ఇస్తామని చెప్పారు. సమస్య తీవ్రతను బట్టే చర్యలు ఉంటాయని తెలిపారు. వ్యవస్థాగత స్థిరత్వం, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పేటీఎంపై ఆంక్షలు విధించామని చెప్పారు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలు, పేటీఎం షేర్ల పతనం నేపథ్యంలో వాటి నుంచి బయటపడేందుకు పలు మార్గాల్ని అన్వేషిస్తోంది బ్యాంకు. ఈ క్రమంలోనే సీఈఓ విజయ్ శేఖర్ శ్రమ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఫిబ్రవరి 6న ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంకుతోనే సమస్య పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలా సీతారామన్‌ సూచించినట్లు తెలుస్తోంది. రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు కేంద్ర బ్యాంక్ అధికారులతో కూడా విజయ్ శర్మ సమావేశమయ్యారు.

బిల్లులు, రీఛార్జ్‌ లు, సినిమా టిక్కెట్‌లు, ఇతర పేమెంట్స్ వంటి సేవలు ఫిబ్రవరి 29 తర్వాత కూడా యథావిధిగా పనిచేస్తాయి. UPI లావాదేవీలు లేదా Paytm QR కోడ్‌లపై ఎలాంటి పరిమితి ఉండదని పేటీఎం వివరించింది.


సౌండ్‌బాక్స్, Paytm కార్డ్ మెషీన్‌లు అన్ని ఆఫ్‌లైన్ చెల్లింపులు మునుపటిలాగే పని చేస్తాయి.

మీ ఖాతా లేదా వాలెట్‌లో మీ ప్రస్తుత బ్యాలెన్స్‌పై ప్రభావం చూపదు. మీ డబ్బు బ్యాంకు వద్ద సురక్షితంగా ఉంటుంది.

ఇదే విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్, ఔట్‌లుక్ ఫిబ్రవరి 3న నివేదించాయి.

అందువల్ల, ఫిబ్రవరి 29 తర్వాత కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు ఆగిపోనున్నాయి. మిగిలిన ఎలాంటి UPI చెల్లింపులపై ప్రభావం చూపవు. బ్యాంకు ఖాతాల సహాయంతో బిల్లులు మునుపటి లాగే చెల్లించవచ్చు.

Credits : Sunanda Naik

Claim Review:Paytm ను మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? ఫిబ్రవరి 29 తర్వాత కూడా..
Claimed By:Social Media User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Next Story