జమ్మూకశ్మీర్: మద్యం ప్రియులకు భారీ షాక్..50శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంపు
By సుభాష్ Published on 17 May 2020 12:18 PM GMTకరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 17తో ముగియనున్న లాక్డౌన్ 18 నుంచి మరో రెండు వారాల పాటు దేశంలో లాక్డౌన్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ 3.0లో కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. ఇక లాక్డౌన్ 4.0లో ఇంకా ఎక్కువగా సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూతపడ్డ మద్యం షాపులకు సైతం నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తూ మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక అదే అదనుగా భావించిన కొన్ని ప్రభుత్వాలు మద్యం ధరలు భారీగా పెంచేశాయి.
ఇక తాజాగా జమ్మూకశ్మీర్ కూడా అదే బాటులో పయనిస్తోంది. మద్యంపై 50శాతం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. విస్కీ, బీర్, వైన్ తదితర బ్రాండ్లపై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక కరోనా కాలంలో ప్రభుత్వాలకు భారీగా ఆదాయం తగ్గిపోయింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వాలు మద్యం ధరలు పెంచేశాయి. కాగా, ఇప్పటి వరకూ ఏపీలో జగన్ ప్రభుత్వం 75శాతం ధరలను పెంచగా, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం 70 శాతం ధరలను పెంచేశాయి. అలాగే తెలంగాణలో కూడా మద్యం ధరలు భారీగానే పెంచేసింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వాలు మద్యం ధరలు ఎంత పెంచినా మద్యం ప్రియులు మాత్రం మద్యం తాగకుండా ఉండలేకపోతున్నారు. మద్యం షాపులు తెరవడమే ఆలస్యంగా క్యూలు కట్టేస్తున్నారు. ఇక ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మద్యం షాపుల సంఖ్యను కూడా తగ్గిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.