దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘కత్తి కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన కాంతారావు నటనను పొగిడే క్రమంలో ఎంజీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారావుని చూసి ఎంజీఆర్ భయపడ్డారంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారాయి.
ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ నటుడు విశాల్ స్పందించారు. ఎంజీఆర్పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు విని దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుతూ ట్వీట్ చేశారు. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరుగాంచిన దివంగత దిగ్గజ నటుడు ఎంజీఆర్ గురించి మీరు చేసిన ప్రసంగాన్ని ఖండిస్తున్నానన్నారు. దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం బాగుంది. కానీ ఆయనను పొగిడేందుకు మరొక దిగ్గజ నటుడు ఎంజీ రామచంద్రన్ గారిని కించపరచడం తగదు. ఆయన్ను ఆరాధించే ప్రజల మనోభావాలను గాయపరచడం మంచిది కాదన్నారు. ఈ వివాదానికి మీరు ముగింపు పలకాలని అభ్యర్థిస్తున్నాను. మీరు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నందుకు మన్నించండి. ఎవరైనా మీ స్థాయి నటుల గురించి భవిష్యత్తులో చెడుగా మాట్లాడితే నటుడిగా నేను కూడా అలాగే చేస్తానని విశాల్ అన్నారు.