అభిమాని మృతి.. విరూపాక్ష టీజ‌ర్ రిలీజ్ వాయిదా

భీమ‌వ‌రం సాయిధ‌ర‌మ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రావూరి పండు మ‌ర‌ణించ‌డంతో విరూపాక్ష టీజ‌ర్ విడుద‌ల‌ వాయిదా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2023 8:07 AM GMT
అభిమాని మృతి.. విరూపాక్ష టీజ‌ర్ రిలీజ్ వాయిదా

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. కార్తీక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. నేడు(మార్చి1 బుధ‌వారం)ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే.. టీజ‌ర్ విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా నేడు తెలియ‌జేసింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ వీరాభిమాని మ‌ర‌ణించ‌డ‌మే అందుకు కార‌ణం అని తెలిపింది.

భీమ‌వ‌రం సాయిధ‌ర‌మ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రావూరి పండు(28) గుండెపోటుతో చ‌నిపోయాడు. సాయిధరమ్‌ తేజ్‌ కోసం పండు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. అలాంటి అభిమానిని కోల్పోయినందుకు సాయిధరమ్‌ తేజ్ తీవ్ర విచారం చేశారు. పండు కుటుంబానికి త‌న‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. త‌న అభిమాని మరణించిన రోజున టీజర్‌ను రిలీజ్ చేయ‌డం భావ్యం కాద‌ని టీజ‌ర్ విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు ఈ చిత్రంపై అంచ‌నాలు పెంచేశాయి. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story