రాజకీయాల్లోకి రావ‌డంపై క్లారిటీ ఇచ్చిన‌ సోనూసూద్

Sonu Sood Gives Clarity About Political Entry. సోనూసూద్ సేవలను గుర్తించి ప్రజలు అలా కోరుకోవడంలో తప్పేమీ లేదని.. కానీ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  12 May 2021 10:15 AM GMT
Sonu Sood

సోనూసూద్ చేస్తున్న సేవ‌ల‌పై కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. సోనూసూద్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకొంటున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయ‌న‌ సమాధానం ఇచ్చారు. నా సేవలను గుర్తించి ప్రజలు అలా కోరుకోవడంలో తప్పేమీ లేదని.. కానీ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని పేర్కొన్నారు. రాజ‌కీయాలు నా మనస్తత్వానికి సరిపడవని.. కామన్ మ్యాన్‌గానే ప్రజలకు సహాయం చేస్తూ ఉంటాన‌ని.. ఇంత‌కుమించి నాకు ఏమీ కోరికల్లేవు అని సోనూసూద్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం నేను చేస్తున్న సేవ నాకు చాలా సంతృప్తికరంగా ఉందని.. సమాజంలో నా బాధ్యతను నేను సంపూర్ణంగా పూర్తి చేస్తున్నానని.. జీవితంలో అంతకంటే ఏం కావాలని సోనుసూద్ అన్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం దేశంలో తీవ్ర‌మైన ఆక్సిజ‌న్ కొర‌త ఉంది. ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ అంద‌క ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. క‌ళ్లముందే అయినవారిని కోల్పోతున్నా.. ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉండి పోవాల్సిన పరిస్థితి చూస్తున్నాం. దీనిని గ‌మ‌నించిన సోనూసూద్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. తీవ్ర‌మైన ఆక్సిజ‌న్ కొర‌త ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను నెల‌కొల్పానే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ప్రాన్స్ స‌హా ఇత‌ర దేశాల నుంచి వీటిని దిగుమతి చేయ‌నున్నారు.

ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కి ఆర్డర్ చేశామని.. మరో 10-12 రోజులలో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూసూద్ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి.. ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోనూ ప్రకటించారు. ''ప్రస్తుతం సమయం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ప్రతీది సమయానికి అందించేలా.. మా వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాల్ని కాపాడుకోగలమ‌ని సోనూసూద్ చెప్పారు.




Next Story