విషాదంలో సినీ ఇండస్ట్రీ.. కరోనాతో సంగీత దర్శకుడు మృతి
Odia music director and singer Amarendra Mohanty passes away due to Covid. తాజాగా ఒడియా ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి సోమవారం నాడు మృతి చెందారు.
By Medi Samrat Published on 18 May 2021 10:29 AM GMT
కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి ఎంతోమంది మరణించగా.. తాజాగా ఒడియా ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి సోమవారం నాడు మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఉదయం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అమరేంద్ర మహంతి.. ఒడియాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. మూడు దశాబ్ధాల ఆయన సినీ కెరీర్లో ఎన్నో విజయవంతమైన పాటలతో అలరించారు.
ఆకాశవాణితో తన కెరీర్ ప్రారంభించిన ఆయన.. 'శ్రద్ధాంజలి' అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'పుచ్చ్కీ గాలీ' పాటతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. 'భాయ్ హేలా భాగరీ', 'బాసుదా', 'స్త్రీ', 'మగుని రా సగదా' తదితర ఫేమస్ పాటలను కంపోజ్ చేసి.. ఆయన సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. మహంతి చివరిగా 'గాన్ రా నా గౌలపూర్' అనే సినిమాకు పని చేశారు. అమరేంద్ర మహంతి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర షడంగి, ఓలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.