టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది ఇండియన్ హౌస్' షూటింగ్లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు సాంకేతిక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో సినిమా సెట్ మొత్తం జలమయమైంది.
వివరాల్లోకి వెళితే... 'ది ఇండియన్ హౌస్' సినిమాలోని ఒక కీలక సన్నివేశం కోసం చిత్ర యూనిట్ సముద్రపు నేపథ్యాన్ని సృష్టించేందుకు ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంక్ను నిర్మించింది. నిన్న ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్కు తీవ్ర గాయాలయ్యాయని, మరికొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రమాదం జరిగిన సమయంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ సెట్లో ఉన్నారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. వాటర్ ట్యాంక్ కూలిన తర్వాత సెట్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.