హీరో నిఖిల్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. 'నిన్ను త‌ల‌వ‌ని రోజుండ‌దు నాన్న‌'

Nikhil Siddhartha Pens An Emotional Note On His Father’s Demise.హీరో నిఖిల్ ఇంట విషాద చాయ‌లు అలుముకున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2022 8:48 AM GMT
హీరో నిఖిల్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. నిన్ను త‌ల‌వ‌ని రోజుండ‌దు నాన్న‌

హీరో నిఖిల్ ఇంట విషాద చాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న తండ్రి కావ‌లి శ్యామ్ సిద్దార్థ్ గురువారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. త‌న తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ జీవితంలో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ని, తండ్రితో త‌న‌కున్న బంధాన్ని, పోగుచేసుకున్న జ్ఞాపకాలను నెమ‌రువేసుకుంటూ శుక్ర‌వారం ఉద‌యం నిఖిల్ సోష‌ల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేసి బావోద్వేగానికి గుర‌య్యాడు.

'నా తండ్రి శ్యామ్‌ సిద్దార్థ్ మ‌ర‌ణించారు అనే విష‌యాన్ని బ‌రువైన హృదయంతో మీకు తెలియ‌జేస్తున్నాను. నాన్న నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను. ల‌వ్ యూ.. మ‌నం ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్‌ను ఎంజాయ్‌ చేయడం, ఇవన్నీ నేను మిస్‌ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను' అని నిఖిల్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

'ఎన్నో వేల మంది విద్యార్థుల‌కు ఆయ‌న చ‌దువునందించారు. మ‌రెంతో మందికి కెరీర్‌లో మార్గ‌నిర్దేశం చేశారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఆయ‌న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావుకు వీరాభిమాని. నన్ను వెండితెరపై చూడాలని కలలు కన్నాడు. ఆయన సహాయసహకారాలు, ప్రోత్సాహం అందించడం వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. జేఎన్‌టీయూ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో ఆయన స్టేట్‌ టాపర్. ఎప్పుడూ కష్టాన్ని న‌మ్ముకున్నారు. జీవితంలో ఎంతో క‌ష్ట‌ప‌డి స‌రిగ్గా దాని ఫ‌లాలు అందుకునే స‌మయంలో అనుకోకుండా అరుదైన వ్యాధి బారిన ప‌డ్డారు. ఎనిమిదేళ్లుగా ఆ వ్యాధితో పోరాడారు. అయితే.. అనుకోని విధంగా నిన్న‌(గురువారం) ఆయ‌న తుదిశ్వాస విడిచారు. మిమ్మ‌ల్ని స్మ‌రించుకోకుండా ఇక‌పై మా రోజులు గ‌డువ‌వు' అని బావోద్వేగంతో నిఖిల్ రాసుకొచ్చాడు. త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.

Next Story