హైదరాబాద్: టాలీవుడ్ సినీ కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. వారికి కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని అన్నారు. వారిపై కేసుల పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. 'మన కార్మికుల్లో నైపుణ్యం లేదంటే ఒప్పుకోను. నిర్మాతలను కలిసి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. ఇందుకు ఈ నెల 11న ఇరు వర్గాలతో చర్చలు జరుపుతాం. అలాగే మల్టీప్లెక్సుల్లో దోపిడీని అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తాం' అని ఆయన పేర్కొన్నారు. అటు సినీ కార్మికుల సమ్మె టాలివుడ్ పై భారీ ఎఫెక్ట్ చూపుతోంది.
గత 5 రోజులుగా సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్కు చెందిన కార్మికులు విధులను బహిష్కరించారు. సినీ నిర్మాతలు ఇచ్చిన హామీ ప్రకారం.. మూడేళ్లకోసారి 30శాతం జీతాలు పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సినీ నిర్మాతలు మరోలా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కార్మికుల సమస్యలపై చాలా సార్లు స్పందించామని, పెద్ద మొత్తంలో శాలరీలు ఇస్తున్నామంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే కార్మికులు సినిమా షూటింగ్స్ బంద్ చేసి సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే కార్మికుల సమ్మెపై నిర్మాతలు పట్టువీడటంలేదు. అవసరమైతే కొత్తవారితో షూటింగ్స్ పూర్తి చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.