ఆస్కార్స్ 2022: భారత్‌ నుండి ఉత్తమ చలనచిత్రాలుగా.. అర్హత సాధించిన సినిమాలివే.!

Jai Bhim, Marakkar eligible for Best Feature Film at Oscars 2022. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన, హీరో సూర్య నటించిన 'జై భీమ్' సినిమా నవంబర్ 2021లో నేరుగా అమెజాన్ ప్రైమ్

By అంజి  Published on  21 Jan 2022 8:13 AM GMT
ఆస్కార్స్ 2022: భారత్‌ నుండి ఉత్తమ చలనచిత్రాలుగా.. అర్హత సాధించిన సినిమాలివే.!

టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన, హీరో సూర్య నటించిన 'జై భీమ్' సినిమా నవంబర్ 2021లో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఆ తర్వాత ఆస్కార్స్ 2022లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌కి అర్హత సాధించింది. జై భీమ్‌తో పాటు, మళయాళ హీరో మోహన్‌లాల్ నటించిన 'మరక్కర్: లయన్‌ ఆఫ్‌ ది అరేబియ్‌ సీ' షార్ట్‌లిస్ట్ చేయబడింది. తుది నామినేషన్ జాబితా ఫిబ్రవరి 8, 2022న ప్రకటించబడుతుంది.

ఇరులర్ తెగ సభ్యులకు జరిగిన అన్యాయం, పోలీసుల క్రూరత్వం గురించి చెప్పిన సూర్య జై భీమ్, 2021లో ఉత్తమ తమిళ చిత్రాలలో ఒకటి. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య, లిజోమోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రలు పోషించారు. 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌కి ఎంపికైన ఏకైక తమిళ చిత్రం జై భీమ్. ప్రపంచవ్యాప్తంగా షార్ట్‌లిస్ట్ చేసిన 276 చిత్రాలలో, జై భీమ్, మలయాళ చిత్రం 'మరక్కర్: లయన్‌ ఆఫ్‌ ది అరేబియ్‌ సీ' భారతదేశం నుండి ఎంపిక చేయబడ్డాయి. ఆస్కార్ నామినేషన్ ఓటింగ్ గురువారం (జనవరి 27) ప్రారంభమవుతుంది. తుది నామినేషన్ జాబితా ఫిబ్రవరి 8, 2022న మంగళవారం ప్రకటించబడుతుంది. అవార్డ్ వేడుక మార్చి 27, 2022 ఆదివారం, హాలీవుడ్ అమెరికాలో షెడ్యూల్ చేయబడింది.

'మరక్కర్: లయన్‌ ఆఫ్‌ ది అరేబియ్‌ సీ'

ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మోహన్‌లాల్ 'మరక్కర్: లయన్‌ ఆఫ్‌ ది అరేబియ్‌ సీ'. ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులను సాధించింది. 16వ శతాబ్దపు కాలికట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం జామోరిన్ నౌకాదళానికి చెందిన అడ్మిరల్ కుంజలి మరక్కర్ ఆధారంగా రూపొందించబడింది. పీరియాడికల్ ఫిల్మ్‌లో కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, మంజు వారియర్, సిద్ధిక్ కూడా ఉన్నారు.

Next Story