హైదరాబాద్: నేడు హైటెక్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. విజేతలకు షీల్డ్తో పాటు నగదు పురస్కారం కూడా అందిస్తారు. ఉత్తమ నటుడు, నటికి రూ.5 లక్షలు, ఉత్తమ మొదటి చిత్రానికి రూ.10 లక్షలు, రెండో సినిమాకు రూ.7 లక్షలు, మూడో చిత్రానికి రూ.5 లక్షలు ఇస్తారు. ప్రత్యేక అవార్డులు పొందిన వారికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తారు. ఇటీవల గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు' అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమని పేర్కొన్నారు. 2014 నుంచి 2024 వరకు - తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం, చలనచిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించటం అభినందనీయమని అన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని ముఖ్యమంత్రి అభినందించారు.