లైగర్ ఎఫెక్ట్.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఛార్మీ
Charmy Reacts on Liger Movie Exhibitors Protest In Front Film Chamber. విజయ దేవరకొండ హీరోగా వచ్చిన 'లైగర్' సినిమా దారుణ పరాజయం పాలైంది.
By Medi Samrat
Charmy Reacts on Liger Movie Exhibitors Protest In Front Film Chamber
విజయ దేవరకొండ హీరోగా వచ్చిన 'లైగర్' సినిమా దారుణ పరాజయం పాలైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తీవ్ర నష్టాలను చవిచూసింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమా వల్ల నష్టపోయిన వారికి సెటిల్ చేసేందుకు పూరీ జగన్నాథ్ గతంలో అంగీకరించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లైగర్'. అనన్యా పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజాగా నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. లైగర్ సినిమాతో తమకు భారీ నష్టాలు వచ్చాయని, తమను ఆదుకోవాలని కోరుతూ నిరసన తెలిపారు. ఆర్థికంగా నష్టపోయిన తమకు పూరీ జగన్నాథ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ నేటి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సినీ నటి చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫిల్మ్ చాంబర్ కు మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించారు. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.