తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. పోయెస్ గార్డెన్లోని సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం, అల్వార్పేటలో ఉన్న హీరో ధనుష్ ఇళ్లలో బాంబులు అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలవచ్చని ఆ మెయిల్లో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి రంగంలోకి దిగారు. ఇద్దరు నటుల నివాసాల వద్దకు చేరుకున్న భద్రతా దళాలు సుమారు గంటన్నర పాటు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇంటి లోపల, గార్డెన్ ప్రాంతం, పరిసరాల్లో అణువణువూ గాలించినా ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించలేదు. చివరకు అది ఒక 'ఫేక్ మెయిల్' అని అధికారులు నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రజనీకాంత్, ధనుష్ నివాసాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.