కీల‌క నిర్ణ‌యం.. ఏపీలో ఇక‌పై త‌క్కువ ధ‌ర‌కే సినిమా టికెట్లు

AP film corporation to launch portal for sale of movie tickets.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల‌పై ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2022 2:27 AM GMT
కీల‌క నిర్ణ‌యం.. ఏపీలో ఇక‌పై త‌క్కువ ధ‌ర‌కే సినిమా టికెట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఇక పై త‌క్కువ ధ‌ర‌కే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు ల‌భించ‌నున్నాయి. బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏపీ ఎఫ్ డీసీ పోర్టల్ 'యువర్ స్క్రీన్స్' ను తీసుకురానుందని, తద్వారా టికెట్ బుకింగ్ చేసుకుంటే ప్రేక్షకుడిపై ఎలాంటి అదనపు భారం పడకుండా దోపిడీకి చెక్ పడనుందని చలన చిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ.టి.విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఆన్‌లైన్ విధానం వ‌ల్ల తాము న‌ష్ట తాము న‌ష్ట‌పోతామ‌ని థియేట‌ర్ల యాజ‌మాన్యం, ఎగ్జిబిట‌ర్లు ఆందోళ‌న చెందుతుండ‌గా.. దీనిపై విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేర‌కు ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఇక‌మీద‌ట‌.. ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే ప్రేక్షకులు జేబులు చిల్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా తక్కువ ధరకే సినిమా టికెట్ బుక్ చేసుకుని ఇంటిల్లిపాది సంతోషంగా సినిమాను చూడొచ్చున‌ని అన్నారు.

ఇతర పోర్టల్ లలో టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ పై అదనంగా రూ.20 నుండి రూ.25 వరకు అధికంగా ప్రేక్ష‌కుడిపై భారం ప‌డుతుంద‌ని, దీనికి అడ్డుకట్ట వేయాల‌నే ప్ర‌భుత్వం యువర్ స్క్రీన్స్ ను తీసుకువ‌చ్చింద‌ని, దీని ద్వారా టికెట్‌పై రూ.1.95 శాతం మాత్రమే అంటే సున్నా ఛార్జీ పడుతుందన్నారు. త‌ద్వారా ఒక్కొ టికెట్‌పై ప్రేక్ష‌కుడికి రూ.25 భారం త‌గ్గ‌నుంద‌ని తెలిపారు.

కాగా.. ఇటీవ‌ల కొంద‌రు సినీ ప్ర‌ముఖులు సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని ప్ర‌వేశ పెట్ట‌మ‌ని కోరిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో సినీ ఇండస్ట్రీ 24 క్రాప్ట్స్ ప్రతినిధులతో గతేడాది సెప్టెంబర్ లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, సర్వీస్ ప్రొవైడర్లు తదితరులతో నాటి మంత్రి పలుదఫాలుగా స‌మావేశాలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు సేకరించిన అనంతరం ప్రభుత్వమే ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి శ్రీకారం చుట్టిందని వివరించారు.

ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో థియేటర్ల వారికి ప్రత్యేక ఏర్పాటు ఉందని చెబుతూనే అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో అప్పటికి ప్రభుత్వ ఎగ్జిస్టింగ్ జీవో ప్రకారం కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో థియేటర్ల వారికి తమ డబ్బు తమకు సక్రమంగా రాదనే అపోహలు అవసరం లేదన్నారు. థియేటర్లకు రోజువారీగా అంటే ఏ రోజుకు ఆ రోజే డబ్బు బదలాయింపు జరుగుతుందని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నామన్న విషయం గుర్తు చేశారు. థియేటర్ యాజమాన్యాల కోరిక మేరకే ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 13 విడుదల చేసిన విషయం గుర్తుచేశారు.

ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల థియేటర్స్ కి ఉన్న గత ఒప్పందాలు రద్దవుతాయన్న అపోహలు అక్కర్లేదని, పాత ఒప్పందాలు యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్ బుక్ చేసుకునే అవకాశం థియేటర్లు కల్పించాలన్నారు. ఇందుకు అవసరమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను కూడా ప్రభుత్వమే అందిస్తుందని స్ప‌ష్టం చేశారు. దీంతో ప్రేక్షకుడు రేటుతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పోర్టల్ నుండి టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందన్నారు.

దీని వ‌ల్ల రోజువారీగా ఎన్ని టికెట్లు అమ్ముడ‌వుతున్నాయి, ఎంత జీఎస్టీ వ‌సూలైంది వంటి వివ‌రాలు తెలుస్తాయ‌ని, త‌ద్వారా ప‌న్ను ఎగ‌వేత‌కు ఆస్కారం ఉండ‌ద‌న్నారు. ఇక ప్రేక్ష‌కుడికి ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌కే టికెట్ అందుబాటులో ఉంటుంద‌న్నారు.

Next Story