కమెడియన్ వివేక్ మరణంపై నటుడు మన్సూర్ సంచలన వ్యాఖ్యలు
Actor Vivek Passed Away Mansoor Ali Khan Argued in Hospital.వివేక్ మరణంపై దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 18 April 2021 3:04 PM IST
తమిళ నటుడు, సామాజిక కార్యకర్త వివేక్ మరణం చిత్ర పరిశ్రమను కలచివేసింది. కరోనా టీకా వేయించుకున్న తర్వాతి రోజే వివేక్ కు హార్ట్ అటాక్ రావడం సంచలనం అయింది. వివేక్ కరోనా టీకా వేసుకున్న తర్వాత.. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అయితే వివేక్ మరణంపై దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కరోనా టీకాతో మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని మన్సూర్ అలీఖాన్ ప్రశ్నించారు. కరోనా కేసుల సంఖ్య పత్రికల్లో వేయడం నిలిపివేయండి. ఎందుకు ప్రజలను భయపెడుతూ చంపుతున్నారు.. అని ప్రశ్నించారు మన్సూర్.
వివేక్ బాగానే ఉన్నాడుగా, ఎందుకు కరోనా టీకా వేశారు? ఆ టీకాలో ఎలాంటి సామర్ధ్యం ఉంది? దేశంలో కరోనా లాంటి వైరస్లు చాలా ఏళ్లుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మన్సూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొండాముత్తూరు నియోజకవర్గంలో పోటీచేసిన నేను ప్రచారంలో భిక్షగాళ్ల పక్కన, కుక్క పక్కన కూడా కూర్చున్నాను. నాకు కరోనా రాలేదే? మాస్క్లు వేసుకోమని ఎందుకు చెబుతున్నారు? మనం వదిలే గాలి చెడ్డగాలి అని చెబుతున్నారు, మరి మాస్క్ వేసుకొంటే చెడ్డగాలిని మళ్లీ పీల్చాల్సి వస్తుందిగా? అని ప్రశ్నించారు.
కరోనా లేదని చెబుతున్నందుకు నన్ను తీసుకెళ్లి జైలులో వేయండని ఆయన అన్నారు. షూటింగ్లకు కరోనా సర్టిఫికెట్ తప్పనిసరి చేశారని.. ఈ టెస్ట్కు రూ.2 వేలు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోంది. అంత స్థోమత లేని జూనియర్ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయి రోడ్లపై పడ్డారని మన్సూర్ తెలిపారు. కరోనా టీకా వేయించుకొనే వారందరికి ఇన్యూరెన్స్ ఇవ్వండి. వ్యాధి నిరోధక శక్తి పెంచేలా పారంపర్యమైన మూలికల కషాయాలను ప్రజలకు ఉచితంగా అందించాలని కోరారు.