సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కూడా ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్తులు, వ్యక్తిగత జీవితం గురించి యూట్యూబ్లో పలు తప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఇంటి ముందు అరడజను ఖరీదైన కార్లు నిలిపి ఉన్నాయని, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. తనికెళ్ల భరణి వీడియో రూపంలో వీటిపై స్పందించారు. ఇటీవల నా ఆస్తులు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే అని రాశారు. కానీ ఆ వార్తలు చూసి నేనే షాక్ అయ్యానని ఆయన అన్నారు. ఆ వార్తలు చూసి తాను, తన కుటుంబ సభ్యులు కలిసి నవ్వుకున్నామని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, తాను ఏదో ఒక దేశం లేదా మతానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరగడాన్ని కూడా ఆయన ఖండించారు. నేను అన్ని మతాలను, అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తానన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు తనను నమ్మే మిత్రులు, శ్రేయోభిలాషులను బాధకు గురిచేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను నమ్మకూడదని, అసత్య ప్రచారాలను ప్రోత్సహించవద్దని ప్రజలను కోరారు.