విద్యార్థులకు అలర్ట్..నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది
జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో 2026-27 అకడమిక్ ఇయర్కు గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
By Knakam Karthik
విద్యార్థులకు అలర్ట్..నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది
జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో 2026-27 అకడమిక్ ఇయర్కు గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం.. ఈ పరీక్ష ద్వారా 653 నవోదయ విద్యాలయాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 15 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 15 నుంచి నవంబర్ 15 ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ..
అర్హతలో భాగంగా విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, వయస్సు మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్య ఉండాలని అధికారులు తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న జిల్లాలో నివసించాలి, అదే జిల్లాలోని పాఠశాలలో చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాగా జేఎన్వీలో ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. రెసిడెన్షియల్ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్ వర్గాల(దారిద్య్ర రేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపునిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9
జవహర్ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో దేశ వ్యాప్తంగా మొత్తం 653 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఏర్పాటయ్యాయి. ఏపీలోని 15 పాఠశాలల్లో.. 2 పాఠశాలలను ఎస్సీ/ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
పరీక్ష రెండు దశల్లో - జనవరి 17 (ఫేజ్ 1), ఏప్రిల్ 11(ఫేజ్ 2)లో జరగనుంది. దరఖాస్తు ఫీజు లేకుండా navodaya.gov.in లేదా cbseitms.rcil.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మొత్తం 100 మార్కులకు 2 గంటల పరీక్ష ఉండగా.. వీటి ఫలితాలు జూన్ లో విడుదల కానున్నాయి.