హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ-2025 (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18వ తేదీ నుంచి జులై 17 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో జులై 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో 46,742 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 297 పీజీ కాలేజీలున్నాయి. వీటిల్లో పీజీ కోర్సులతోపాటు, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులున్నాయి. సీపీ గెట్ ఎంట్రెన్స్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లోని సీట్లను నింపుతారు. ఈసారి నుంచి కొత్తగూడెంలో ఏర్పాటు చేసే ఎర్త్సైన్స్ యూనివర్సిటీలోని సీట్లను సైతం ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే భర్తీ చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో సీట్లు భర్తీచేసే అవకాశం ఛాన్స్ ఉంది.