పెళ్లి వ్యాన్‌ బోల్తా.. ఏడుగురు దుర్మరణం

By సుభాష్  Published on  30 Oct 2020 5:24 AM GMT
పెళ్లి వ్యాన్‌ బోల్తా.. ఏడుగురు దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్‌లో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వ్యాను అదుపు తప్పి బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన జిల్లాలోని గోకరవరంలో జరిగింది. గోకవరం మండలం ఠాకూర్‌పాలెంకు చెందిన యువకుడు, రాజానగరం మండలం వెలగుబందాకు చెందిన యువతికి గురువారం రాత్రి తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిగింది. వివాహ వేడుక పూర్తయిన తర్వాత వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు 22 మందికిపైగా వ్యాన్‌లో కొండపై నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వ్యాన్‌ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదపుపు తప్పి మెట్ల మార్గం ద్వారా కొండ కిందకు బోల్తా పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతి చెందారు. మిగతా వారు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ప్రమాదంతో ఏడుగురు మృతి చెందిన వారి వివరాలు..

యళ్ళ శ్రీదేవి (35)

యళ్ళ నాగ శ్రీ లక్ష్మి (10)

కంబాల భాను (35)

సింహాద్రి ప్రసాద్ (25)

పచ్చకూరి నరసింహం (24)

చాగంటి హేమ శ్రీలత (12)

సోమరౌతు గోపాలకృష్ణ (72).

ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆళ్ల నాని కాకినాడ సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. అలాగే రాజమండ్రిలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి.

East Godavari Road Accident 1

Next Story