హైదరాబాద్‌లో మరోసారి భూకంపం

By సుభాష్  Published on  22 Oct 2020 5:03 AM GMT
హైదరాబాద్‌లో మరోసారి భూకంపం

హైదరాబాద్‌ నగరంలో మరోసారి భూమి కంపించింది. వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహినగర్‌లలో గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించి శబ్దాలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదు.

ఒక వైపు భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుంటే మరో వైపు భూకంపం తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే అల్పపీడనం కారణంగా వరదలతో నగరమంతా జలదిగ్బంధంలో ఉంటే.. తాజాగా సంభవించిన భూ ప్రకంపనల కారణంగా ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు నగరంలో భూకంపం చోటు చేసుకోగా, మళ్లీ భారీ శబ్దాలతో ప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

15వ తేదీన కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌ నగరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీ శబ్దాలతో కూడిన భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గచ్చిబౌలి టీఎన్‌జీఓస్‌ కాలనీతో పాటు ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో రాత్రి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత 15న అర్ధరాత్రి మొదలై మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పలు మార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

Next Story