ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి మందు బాబులు..!

By Newsmeter.Network  Published on  30 March 2020 10:40 AM GMT
ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి మందు బాబులు..!

ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి మందుబాబులు క్యూ కడుతున్నారు.. ఇదేంటి ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి ఎందుకు..? మందుబాబులకు అక్కడేం పని..? మద్యం విక్రయాలు చేస్తున్నారా..? ఆగండాగండి.. అదేంకాదండి బాబు.. మద్యం లేక వెర్రిచేష్టలు చేస్తున్న వారందరిని తమ కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నడుస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ విధించారు. దీనికితోడు తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కేవలం ఒక్క నిత్యావసర సరుకులు, ఇతర అత్యవసర సేవలు తప్పితే మిగిలిన వారెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులుసైతం పకడ్బందీగా విధులు నిర్వహిస్తుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం షాపులను పూర్తిగా బంద్‌ చేశారు. దీంతో ప్రతీరోజూ మద్యానికి అలవాటు పడిన ప్రజలు మందు దొరక్క తిక్కతిక్కగా చేస్తున్నారు. మద్యం కోసం పలువురు ఆడవాళ్లు, మగవాళ్లు ఎక్కడ దొరుకుతుందా అని వెంపర్లాడుతున్నారు. మందు దొరక్క మైండ్‌ పనిచేయక ఆత్మహత్యలకు పాల్పడ్డుతున్నారు.

Also Read :ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?

తాజాగా మద్యానికి బానిసైన ఓ యువకుడు హైదరాబాద్‌లో నడి రోడ్డుపై గొంతు కోసుకున్నాడు. ఇటీవల మద్యం కోసం ఏకంగా ఒకడు సెల్‌ టవర్‌ ఎక్కాడు. అదేవిధంగా వికారాబాద్‌ జిల్లా తోరుమామిడికి చెందిన మొగులయ్య అర్థరాత్రి దాటక ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని తీవ్ర గాయాలతో మృతిచెందాడు. వెల్లుర్తి మండలం మూసాయిపేటలో చెందిన కాశమైన కిష్టయ్య ఇంట్లోనే దూలానికి ఉరివేసుకొని చనిపోయాడు. మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన మహిళ కల్లు దొరక్క మతిస్థిమితం కోల్పోయి ఇంట్లోనే కింద పడిపోయి మృతిచెందింది. నిజాంపేటలో కిష్టయ్య అనే వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన సయ్యద్‌ కల్లు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి కత్తి తెచ్చుకొని పొట్ట భాగంలో కోసుకున్నాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మందుకు బానిసలైన వారు మైండ్‌ పనిచేయక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వైద్యం కోసం వారి వారి కుటుంబ సభ్యులు పిచ్చిగా ప్రవర్తించే మందుబాబులను ఎర్రడగడ్డలోని మెంటల్‌ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 100 మంది ఓపీ ఉన్నట్లు వారిలో అందరూ మందుకు బానిసలై ప్రస్తుతం పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారేనని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.

Also Read :ఏప్రిల్‌ 2వరకు కీలక దశ.. కరోనాపై బాల జ్యోతీష్యుడు ఏం చెప్పాడంటే..?

ఈ సందర్భంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ డా. ఉమా శంకర్‌ మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా ఆస్పత్రికి భారీగా ఓపీ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మొన్నటి వరకు రోజుకు 30 నుంచి 40 వరకు వస్తే అందులో నాలుగు వరకు మద్యం కేసులు ఉండేవని, ఇవాళ ఒక్క రోజే 100 ఓపీ కేసులు మద్యానికి సంబంధించినవి వచ్చాయని ఆయన తెలిపారు. వారందరికీ చికిత్స అందిస్తున్నామని అవసరమైన వారిని ఇక్కడే అడ్మిట్‌ చేసుకొని మిగిలిన వారిని చూసి పంపిస్తున్నామని అన్నారు. ప్రతీ రోజూ మద్యం, కల్లు తాగే అలవాటు ఉండటం వల్ల, ప్రస్తుతం మద్యం, కల్లు లేక పోవటంతో వారి ప్రవర్తన వింతగా మారిందని, ఎక్కువగా క్లోరోఫామ్‌, డైజోఫామ్‌ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మందు దొరకకపోవడం వల్ల ఇది వారిలో 24గంటల్లో వారిపై ప్రభావం చూపుతుందని తెలిపాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం లేదని, జిల్లాల్లో కూడా హాస్పటల్స్‌ ఉన్నాయని, అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపాడు. ప్రతీ హాస్పిటల్‌లో డాక్టర్స్‌ అందుబాటు ఉన్నారని సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు.

Also Read : ఎనిమిది నెలల గర్భిణి 100కి.మీ నడక.. చివరికి..

Next Story