ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?

By Newsmeter.Network  Published on  30 March 2020 4:25 AM GMT
ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే 7లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతుండగా, 32వేలకుపైగా మంది మృత్యువాత పడ్డారు. అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో అయితే రోజుకు వందల సంఖ్యల్లో మృత్యువాత పడుతున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా.. అక్కడ మరణాలు ఆగడం లేదు. ఇటు భారత్‌లోనూ ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. 27మంది మృత్యువాత పడ్డారు. ఇటు తెలంగాణలోనూ 70మందికి వైరస్‌ సోకగా.. ఇద్దరు మృతి చెందారు. ఒక పక్క ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. భారత్‌ లో, ఇటు తెలంగాణలోనూ రోజురోజకు పాజిటివ్‌ కేసులు అధికమవుతున్న క్రమంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Also Read :రెండు ప్రపంచ యుద్ధాల్లో పోరాడి.. కరోనా దాటికి తట్టుకోలేక..

ఏప్రిల్‌ 7నాటికి తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారుతుందని స్వయాన సీఎం కేసీఆరే అనడంతో అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ప్రపంచ దేశాలతో పాటు, భారత్‌సైతం ఈ వైరస్‌తో అతలాకుతలమవుతుంటే.. భారత్‌లో అంతర్భాగమైన తెలంగాణలో అలా ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న అందరి మెదడ్లను తొలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 14వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ గడువు మరింత పెరిగే అవకాశాలు ఉండవచ్చని వైద్యులు సైతం భావిస్తున్నారు. కానీ తెలంగాణలో ఏప్రిల్‌ 7 నాటికి లాక్‌ డౌన్‌ను ఎత్తివేసే అవకాశాలు కూడా ఉంటాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ వ్యాఖ్యలతో అందరిలో సంతోషం వ్యక్తమవుతున్నప్పటికీ.. ఇదెలా సాధ్యమవుతుంది..? దేశంలో సాధ్యం కానిది తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని చర్చించుకుంటున్నారు.

Also Read :ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

సీఎం కేసీఆర్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చి చికిత్స పొందుతున్న వారు 70 మంది ఉన్నారని, ఇప్పటికే వీరిలో ఒకరు డిశ్చార్జి అయ్యారని సీఎం తెలిపారు. మరో 11మందికి ప్రస్తుతం నెగిటివ్‌ వచ్చిందని, అయినా మరో వారం రోజులు గాంధీ ఆస్పత్రిలోనే ఉంచి వారికి మరి కొన్ని దఫాలుగా టెస్టులు నిర్వహించి వారిని డిశ్చార్జి చేస్తామని తెలిపారు. ఇక మిగిలన 58 మందికి కూడా ప్రస్తుతం ప్రమాదకరంగా ఎవరికి లేదని, వారికిసైతం పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌ వస్తుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడు స్టెప్పుల్లో జీరో వైరస్‌ కేసులు నమోదు కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం 25, 937 మంది వైరస్‌ అనుమానితులు అబ్జర్వేషన్‌లో ఉన్నారని, వీరిని ఏడు స్టెప్పుల్లో ఇండ్లకు పంపిస్తామని తెలిపారు. 30 మార్చిన 1,899 మంది, 31 మార్చిన 1440, ఏప్రిల్‌ 1న 1461, ఏప్రిల్‌ 2న 1887 మందిని.. ఇలా ఏప్రిల్‌ 7 వరకు అందరిని ఇండ్లకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఏప్రీల్‌ 7న రోడ్లెక్కాలంటే.. ప్రజలు అలా చేయాలి..

సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలంగాణ జీరో కరోనా వైరస్‌ రాష్ట్రంగా మారాలంటే ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం నిబంధనలు తూచా తప్పకుండా పాటించండం, లాక్‌ డౌన్‌ సమయంలో ఇండ్లలోనే ఉండటం, సామాజిక దూరం పాటించండం, పోలీసులకు సహకరించడం, వైద్యుల సూచనలు పాటించడం వంటి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్‌ 7 నాటికి మనమంతా రోడ్లపైకి రావాలంటే ఇక నుంచి కొత్త కరోనా వైరస్‌ కేసులు నమోదు కాకూడదు. అలా జరగాలంటే ప్రజలంతా ఇండ్లకే పరిమితమవుతూ, సామాజిక దూరం పాటించాలి. అలా ప్రతీ ఒక్కరూ చేయగలిగితే కేసీఆర్‌ చెప్పినట్లు ఏప్రిల్‌ 7 నాటికి తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారుతుందని ప్రముఖ వైద్యులుసైతం పేర్కొంటున్నారు.

Also Read :తెలంగాణలోకి కరోనా వచ్చే అవకాశమే లేదు..

ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరినీ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. బయట నుంచి వచ్చే కేసులు ప్రస్తుతానికి ఏమీలేవు. ఇప్పుడు రాష్ట్రంలో కాంటాక్ట్‌ కేసులు నమోదైతే తప్ప మరో పాజిటివ్‌ కేసులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ప్రస్తుతం కాంటాక్ట్‌ కేసు రాకుండా ఉండాలంటే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. ఇండ్లకే పరిమితం కావాలి. అలా చేయగలిగితే సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు ఏప్రిల్‌ 7 నాటికి ప్రజలంతా రోడ్లపైకి రావటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ముప్పావు శాతం మంది మాత్రమే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారు. 25శాతం మంది తమకేం కాదులే అన్న రీతిలో రోడ్లపైకి వస్తున్నారు. వీరుసైతం ఇండ్లకే పరిమితమై.. సామాజిక దూరం పాటిస్తే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావు. మరి ప్రజలు సీఎం కేసీఆర్‌ సూచించినట్లు ఏప్రిల్‌ 7వరకు ఇండ్లకే పరిమితం అవుతారా..? సామాజిక దూరం పాటిస్తూ కరోనా కాంటాక్ట్‌ కేసులు నమోదు కాకుండా జాగ్రత్త పడగలుగుతారా అనేది వేచిచూడాల్సిందే.

Next Story