అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Nov 2019 11:27 AM ISTముఖ్యాంశాలు
- అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైసీపీ ప్రభుత్వం
- మొదటి విడతగా రూ.264 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
గుంటూరు: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. డిపాజిటర్లకు మొసపోయిన మొత్తలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు.. బడ్జెట్లో రూ.1150 కోట్లు కేటాయించారు. మొదటి విడతలో భాగంగా రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ గత నెల 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 3,69,655 మంది బాధితులకు ఊరట కలగనుంది.
గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం వైఎస్ జగన్ స్వయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇతర జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. తర్వాత దశలో రూ.20 వేల లోపు ఉన్న మరో 4 లక్షల మంది డిపాజిట్ దారులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా బాధితులకు సొమ్ము అందజేయనున్నారు.
ఒక్క గుంటూరు జిల్లాలోనే 19 వేల మంది వరకూ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా వారికి అందించాల్సిన చెక్కులను అధికారులు సిద్ధం చేశారు. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. సీఎం జగన్ గుంటూరు పర్యటన కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, చెరువువాడ రంగనాథరాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సీఎం పర్యటన నేపథ్యంలో వెయ్యి మంది పోలీసు సిబ్బందితో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రమేష్ ఆస్పత్రి వరకూ వాహనాల రాకపోకలను నిషేధించారు.