నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టు కీలక ఆదేశాలు.!
By Newsmeter.Network Published on 9 Dec 2019 10:59 AM GMTదిశ హత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్ను హైకోర్టు లో సోమవారం విచారణ కొనసాగింది. మధ్యాహ్నాం 2:30 గంటలకు విచారణ చేపట్టిన కోర్టు... శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే సోమవారం ఉదయమే విచారణ చేపట్టాల్సి ఉండేది. ఈ ఎన్కౌంటర్పై మరో పిటిషన్ దాఖలు కావడంతో మధ్యాహ్నానికి వాయిదా వేసింది. రెండు పిటిషన్లు కలిపి ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టానికి విరుద్దంగా నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, దీనిపై విచారణ చేపట్టాలని పలు మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని బూటకపు ఎన్కౌంటర్గా ప్రకటించాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సోమవారం రాత్రి వరకు మృతదేహాలను భద్రపర్చాలని గత రెండు రోజుల కిందటే కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో మృతదేహాలను ఉంచారు.
విచారణకు సుప్రీం అంగీకారం..
నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఈ కేసు మరింత వెడెక్కించింది. నిందితులను ఎన్కౌంటర్ చేయడం బూటకమని, పోలీసులు ఏదో సాకులు చెబుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని పిటిషనర్లు జి.ఎస్.మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్ లలో కోరారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై బుధవారం విచారణ జరిపిందేకు న్యాయస్థానం అంగీకరించింది. కాగా, ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం, విచారణ మళ్లీ వాయిదా వేసింది.