పాకిస్తానీకి 'పద్మశ్రీ' ఇచ్చారు.. ఇక 'సీఏఏ' ఎందుకు.? : దిగ్విజయ్
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Jan 2020 3:58 PM GMT71వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020 సంవత్సరానికి గానూ వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అంధించిన పలువురిని కేంద్రం పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేసింది. 2020 సంవత్సరానికి గాను 141 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేయగా.. ఇందులో 118 మందికి పద్మశ్రీ, 16 మందికి పద్మ భూషణ్, ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులకు కేటాయించారు. అయితే ఈ ఏడాది ఇద్దరు విదేశీయులను కూడా కేంద్రం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది.
ఇదిలావుంటే.. అద్నాన్ సమీకి కేంద్రం పద్మశ్రీ కేటాయించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేను అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరానని.. అప్పుడు అందరూ నన్ను విమర్శించారని గుర్తుచేశారు. కానీ అదే ఇప్పుడు పాకిస్తాన్కు చెందిన అతడికి.. భారత పౌరసత్వం ఇవ్వడంతో పాటు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించారని అన్నారు. ఇది ఎంతో మంచి విషయమని దిగ్విజయ్ అన్నారు.
ఇంత మంచి వాతావరణం ఉన్న భారతదేశంలో.. ఇక సీఏఏ అవసరం ఏంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. సీఏఏ చట్టం కేవలం దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తప్పా.. మరెందుకూ ఉపయోగపడదని దిగ్విజయ్సింగ్ అన్నారు.