తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమై 11వ తేదీ వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్ష్మీనృసింహుడి క్షేత్రాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఏటేటా నిర్వహించినట్లు కాకుండా ఈసారి స్వర్ణ విమాన గోపురం కలిగి కొత్త అనుభూతితో ఉత్సవాలు నిర్వహించనున్నారు.
మార్చి 1వ తేదీన స్వస్తివచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. మార్చి 2న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 3న అలంకార సేవలతో శ్రీకారం చుట్టి, శేష వాహన సేవ నిర్వహించనున్నారు. 4న రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ, 5న పొన్న వాహన సేవ, 6న సింహ వాహన అలంకార సేవ, 7వ తేదీ స్వామిఅమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, 8వ తేదీ తిరు కల్యాణమహోత్సవం, 9వ తేదీ దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 11న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకం, శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 వరకు స్వామివారి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహణ, ఉండదని ఆలయ ఈవో వెల్లడించారు.