మహాశివరాత్రి 2023: శివుడి పూజలో మారేడు ఆకును ఎలా సమర్పించాలి?
How to offer Belapatra to Lord Shiva on Mahashivratri. మహాశివరాత్రి పవిత్ర పండుగ 18 ఫిబ్రవరి 2023 న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం
By అంజి Published on 14 Feb 2023 10:23 AM IST
మహాశివరాత్రి పవిత్ర పండుగ 18 ఫిబ్రవరి 2023 న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నారని ప్రతీతి. ఈ రోజున పరమశివుడిని, పార్వతిని పూజించడం వల్ల మనిషి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శివుని ఆరాధనలో బిల్వపత్రం (మారేడు ఆకులు) చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. బిల్వ పత్రం లేకుండా శివుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం.. శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించడం అతనికి సంతోషాన్నిస్తుంది. అయితే మీరు కూడా శివునికి బిల్వపత్రాన్ని సమర్పించాలని అనకుంటున్నారా? అయితే బిల్వపత్రాన్ని శివుడికి నైవేద్యంగా ఎలా సమర్పించాలో కింద చూడండి.
శివలింగంపై బిల్వపత్రం సమర్పించడానికి నియమాలు
మూడు ఆకులతో కూడిన బిల్వపత్రాన్ని ఎల్లప్పుడూ శివలింగంపై సమర్పించాలి. దానిలో మరక లేదా మచ్చ ఉండకూడదని గుర్తుంచుకోండి. శివలింగంపై కత్తిరించిన, ఎండిపోయిన బిల్వత్రాన్ని ఎప్పుడూ సమర్పించకూడదు. శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించే ముందు, దానిని బాగా కడిగి, ఆకులోని మృదువైన భాగాన్ని మాత్రమే శివలింగంపై సమర్పించండి. ఆకు పొడి భాగాన్ని పైకి ఉంచండి. పూజ సమయంలో మీకు బిల్వ పత్రం లేకపోతే, అక్కడ ఉన్న పాత బిల్వ పత్రాన్ని కడిగి శివలింగంపై సమర్పించండి. మీరు శివుడికి 11 లేదా 21 సంఖ్యలో బిల్వ పత్రాలను, లేదా మీరు కనీసం ఒక బిల్వ పత్రాన్ని కూడా అందించవచ్చు. బిల్వపత్రం అందుబాటులో లేకపోతే, అప్పుడు ఎవరైనా బిల్వ చెట్టు దర్శనం చేసుకోవాలి. దానివల్ల కూడా పాపాలు, తాపం నశిస్తాయి.
బిల్వ పత్రం కోసం నియమాలు
బిల్వ ఆకులను తీయడానికి ముందు శివుడిని స్మరించుకోవాలి. ఆకులు తీయడానికి ముందు బిల్వపు చెట్టుకు నమస్కారం చేయాలి. చతుర్థి, అష్టమి, నవమి తిథి, ప్రదోష వ్రతం, శివరాత్రి, అమావాస్య, సోమవారాల్లో బిల్వపత్ర ఆకులను తీయరు. మీరు శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకుంటే, ఈ తేదీలకు ఒక రోజు ముందు బిల్వ పత్రాలను తీసుకొండి. బిల్వ పత్రాన్ని మొత్తం కొమ్మతో పాటు ఎప్పుడూ తీయకూడదు.
శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు
బిల్వ పత్రాన్ని సమర్పించిన తర్వాత, నీటిని సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. స్త్రీలు శివపూజ సమయంలో బిల్వ పత్రాన్ని నైవేద్యంగా పెడితే అఖండ సౌభాగ్యం కలుగుతుంది. బిల్వ పత్రంపై గంధంతో రామ్ లేదా ఓం నమః శివాయ అని రాసి సమర్పించాలి. దీని ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి.