'పౌరసత్వం'పై దద్దరిల్లిన డిల్లీ..!
By అంజి
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నిరసనకారులు న్యూ ఫ్రెండ్స్ కాలనీలో బస్సులకు నిప్పంటించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన రెండు బస్సులను నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంటండగా ఫైరింజన్ ను జామియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఫైరింజన్ ను విద్యార్థులు ధ్వంసం చేశారని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు.
దక్షిణ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. ఘటన చోటు చేసుకున్న ఆ ప్రాంతాన్ని ఆందోళనకారులు దిగ్భంధించారు. పలు చోట్ల వాహనల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. జంతర్ మంతర్ వద్ద సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఓఖ్లా అండర్ పాస్ పై వాహనలు పూర్తిగా నిలిచిపోయాయి. నిరసనల కారణంగా ఢిల్లీలోని జామియా యూనివర్సిటీకి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై స్పందించిన జామియా యూనివర్సిటీ విద్యార్థులు.. తాము అలాంటి మూర్ఖపు పని చేయమని తెలిపారు. తాము శాంతియుతంగా నిరసనను తెలపుతున్నామని, హింసాత్మక చర్యలకు తాము దిగలేదన్నారు.
పశ్చిమబెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముర్షీబాద్లో నిరసనకారులు ఐదు రైళ్లకు నిప్పుపెట్టి హింసకు పాల్పడ్డారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు పెద్ద మొత్తంలో నిరసకారులు ధ్వంసం చేశారు. వందల కోట్ల విలువైన వాటిని ఆందోళనకారులు నాశనం చేశారని అక్కడి ప్రభుత్వ వర్గాలు పెర్కొన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.