ఈసారి భిన్నంగా పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీ ఖరారు..?

By సుభాష్  Published on  25 Aug 2020 1:06 PM GMT
ఈసారి భిన్నంగా పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీ ఖరారు..?

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఖరారైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ లో ఈ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్దమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సూచించినట్లు సమాచారం. మొత్తం 18 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కరోనా కారణంగా సమావేశాల నిర్వహణ కోసం ఉభయ సభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు.

ఈసారి ఉభయ సభల్లోనూ ఛాంబర్లు, గ్యాలరీలు సభ్యులకే సీట్లు కేటాయించననున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్‌లో, మరో 51 మంది గ్యాలరీల్లో, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చునేలా ఏర్పాట్లు చేయడం భారత పార్లమెంట్‌ చరిత్రలో 1952 తర్వాత తొలిసారి.

రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జూలై 17న సమావేశమై పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించిన విషయం తెలిసిందే. ఛాంబర్లు, గ్యాలరీలను సైతం సభ్యులు కూర్చునే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఆగస్టు చివరి నాటికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.

Next Story