త్వరలో రైతులకు పట్టదారు కార్డులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 5:47 AM GMT
త్వరలో రైతులకు పట్టదారు కార్డులు..!

ముఖ్యాంశాలు

  • ప్రతి రైతుకు ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు
  • భద్రత ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డులు ఇవ్వాలని నిర్ణయం
  • రెవెన్యూ భూరికార్డుల ప్రక్షాళన పూర్తి కాగానే ప్రారంభం

అమరావతి: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలకు చెక్‌ పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రైతుకు ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు అందజేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత కార్డు ఎటీఎం కారు సైజులో ఉండి దానిపై భూ యజమాని పేరు, అడ్రస్‌ ఉంటుంది. చిన్న డిజిటల్‌ చిప్‌ అమర్చడం వల్ల కార్డును స్వైప్‌/స్కాన్‌ చేస్తే సదరు రైతుకు ఎక్కడెక్కడ, ఏయే సర్వే నంబర్లలో ఎంత భూముందో కనిపిస్తుంది. భద్రత ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇది ఎలా ఉండాలి? ఒక్కో దానికి ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు పొందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

భూ రికార్డుల ప్రక్షాళన..

భూ రికార్డులు తప్పుల తడకలుగా ఉన్నందున ప్రక్షాళన చేయాలని అధికారులకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మే నెలాఖరుకి భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తైన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో కార్డులు ఇస్తారు. నకిలీలకు, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.

Next Story