2019లో ఉరిశిక్ష తీర్పుల్లో ఎక్కువ శాతం ఈ కేసులే..
By సుభాష్ Published on 3 Feb 2020 1:57 PM IST
దేశంలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యల కేసులు మాత్రం అంతే లేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ కేసు ఎన్నో కీలక తిరుగుతోంది. దోషులకు ఉరిశిక్ష విధించినా.. ఇంకా వాయిదా పడుతూ వస్తోంది తప్ప మరణ శిక్ష మాత్రం పడటం లేదు. న్యాయవ్యవస్థలో కొన్ని నిబంధనలను అడ్డం పెట్టుకోవడం వల్ల దోషులకు ఉరి వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 102 కేసుల్లో న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధించగా, మొత్తం 13 కేసుల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ 12వ స్థానం, మధ్యప్రదేశ్లో 11, కర్ణాటక 10, పశ్చిమబెంగల్ 8, జార్ఖండ్ 8, బీహార్ 7, ఒడిశా 7, కేరళ 5, అస్సాం 4, పంజాబ్ 3, గుజరాత్ 2, తెలంగాణ 2, చత్తీస్గఢ్ 2, మణిపూర్ 1, త్రిపుర 1 స్థానంలో ఉన్నాయి.
ఉరిశిక్ష విధించిన కేసుల్లో అత్యధికంగా లైంగిక కేసులే..
న్యాయస్థానాలు ఉరిశిక్ష విధించిన కేసుల్లో అత్యధికంగా లైంగిక నేరాలే ఉండటం గమనార్హం. హత్య కేసుల్లో లైంగిక నేరాల నిష్పత్తి మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2016లో నేరాల సంఖ్య 18 శాతం నమోదు కాగా, 2019 నాటికి 52.94 శాతానికి పెరగడం దేశం ఎటువైపు వెళ్తుందో అర్థమైపోతోంది. మొత్తం 102 కేసుల్లో ఉరిశిక్ష విధించగా, అందులో 40 శాతం బాధితులు మైనర్ బాలికలే ఉండటం బాధాకరమైన విషయం.
తక్షణమే అమలు కాని మరణ శిక్షలు
దేశ వ్యాప్తంగా లైంగిక నేరాలే అత్యధికంగా నమోదవుతున్నాయి. కింది న్యాయస్థానాలు విధించిన మరణశిక్షలు తక్షణమే అమలు కావడం లేదు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి దేశ వ్యాప్తంగా ఉరిశిక్ష పడిన 378 మంది దోషులున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను దోషులు పై కోర్టులను ఆశ్రయించడంతో ఉరిశిక్షలో జాప్యం ఏర్పడుతోంది. పై కోర్టుల్లో కూడా తీర్పు అనుకూలంగా రాకుంటే చివరగా గవర్నర్, రాష్ట్రపతిని ఆశ్రయిస్తూ పిటిషన్లను దాఖలు చేసుకుంటున్నారు. ఆ పిటిషన్లను కూడా రాష్ట్రపతి తిరస్కరిస్తే తర్వాత మరో కారణంతో పిటిషన్లు దాఖలు చేసుకుంటున్నారు. దీంతో తీర్పు వాయిదా పడుతూ దోషులకు శిక్ష అమలు కావడంలో ఆలస్యమవుతుందనే చెప్పాలి.
ఉరిశిక్ష పడిన రాష్ట్రాల జాబితాలో యూపీ ఆగ్రస్థానం
దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా లైంగిక నేరాలే ఉండటం భయాందోళన కలిగిస్తోంది. లైంగిక నేరాలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలించడం లేదు. నిందితుల్లో ఏ మాత్రం భయం లేకుండా పోతోంది. ఇక కేసుల్లో ఉరిశిక్ష పడిన దోషులు ఉన్న రాష్ట్రాల జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 54 ఉరిశిక్ష పడిన కేసులున్నాయి. మిగతా రాష్ట్రాల వారిగా చూస్తే.. మహారాష్ట్ర 45, మధ్యప్రదేశ్ 34 ఉన్నాయి. గత ఏడాదిలో లైంగిక నేరాలతో సంబంధం ఉన్న 56 హత్య కేసుల్లో కేవలం 15 కేసుల్లో హైకోర్టులు మరణశిక్షను విధించాయి. అలాగే సుప్రీం కోర్టు సైతం మొత్తం 17 కేసుల్లో కేవలం 11 కేసుల్లో ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇక లైంగిక నేరాలతో సంబంధం ఉన్న ఏడు కేసుల్లో నాలుగు ఉరిశిక్షను సమర్ధించింది. 2012 నాటి పోస్కో చట్టంలో సవరణలు జరగడంతో లైంగిక నేరాల కేసులో ఎక్కువగా ఉరిశిక్షలు అమలు చేశాయి న్యాయస్థానాలు. ఈ చట్టం వచ్చిన తర్వాత ఉరిశిక్షలు అధికంగా అమలు చేస్తున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు.