బిగ్ బ్రేకింగ్: నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా
By సుభాష్
నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా పడగా, ఇప్పుడు మూడో సారి వాయిదా పడింది. దోషుల ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు మరోసారి స్టే ఇచ్చింది. దోషి పవన్ గుప్తా డెత్ వారెంట్పై స్టే ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడంతో మరోసారి వాయిదా పడ్డట్లయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
కాగా, మార్చి 3వ తేదీన నలుగురు దోషులకు ఉదయం6 గంటలకు ఉరి తీయాల్సి ఉండగా, పవన్ గుప్తా పిటిషన్ కారణంగా మూడో సారి వాయిదా పడింది.
కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆగ్రహం
నిర్భయ దోషులకు మరోసారి ఉరి శిక్ష వాయిదా పడటంతో కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని చెబుతోంది. దోషులను తప్పించేందుకే ఈ కుట్ర జరుగుతోందని మండిపడింది. తన కూతురుపై దారుణం జరిగి ఇన్నేళ్లు అవుతున్నా.. దోషులకు శిక్ష అమలు చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆమె ప్రశ్నించింది.