బీసీసీఐకి షాక్‌.. దక్కన్‌ చార్జర్స్‌కు రూ.4800కోట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 8:16 AM GMT
బీసీసీఐకి షాక్‌.. దక్కన్‌ చార్జర్స్‌కు రూ.4800కోట్లు

ఒకప్పటి ఐపీఎల్‌ జట్టు అయిన డెక్కన్‌ చార్జర్స్‌(డీసీ) యాజమాన్యం వేసిన కేసులో క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ((బీసీసీఐ)కి ఎదరుదెబ్బ తగిలింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి జట్టును తొలగించడంపై ముంబై హైకోర్టు నియమించిన అర్బిటేటర్‌ తుది తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు బోర్డుకు ప్రతికూలంగా వెలువడింది. నష్టపరిహారంతో పాటు ఇతర ఖర్చుల కింద డీసీ యాజమాన్యానికి బీసీసీఐ రూ.4800కోట్లు చెల్లించాలని హైకోర్టు నియమించిన సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీకే టక్కర్‌ ఆదేశించారు.

ఐపీఎల్ 2008లో ఎనిమిది జట్లతో ఆరంభమైంది. అందులో డెక్కన్‌ చార్జర్స్‌ జట్టుకు కూడా ఒకటి. మొదటి సీజన్‌లో అట్టడు స్థానంలో నిలిచిన ఆ జట్టు రెండో సీజన్‌లో ఛాంఫియన్‌గా నిలిచింది. 2012లో బీసీసీఐ లీగ్‌ నుంచి డీసీని తొలగించింది. ఓ జాతీయ బ్యాంకు నుంచి బీసీసీఐకి రూ.100కోట్ల పూచీకత్తును ఇవ్వడంలో డీసీహెచ్‌ఎల్‌ విఫలమైందనే కారణంతో ఆ జట్టుపై వేటు వేశారు. దాని స్థానంలో మరో జట్టు కోసం బిడ్లను ఆహ్వానించగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం ఆ అవకాశాన్ని దక్కించుకుంది.

తమ జట్టును రద్దు చేయడం అక్రమమని డీసీహెచ్‌ఎల్‌ ముంబై హైకోర్టును ఆశ్రయింది. ఈ కేసులో హైకోర్టు ఎనిమిదేళ్ల క్రితం రిటైర్డ్ జడ్జి జస్టిస్ సీకే ఠక్కర్‌ను ఏకైక మధ్యవర్తిగా నియమించింది. తాజాగా, ఈ కేసులో డెక్కన్ క్రానికల్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. వడ్డీతో సహా బకాయిల మొత్తం రూ. 4,800 కోట్లను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి డెక్కన్ క్రానికల్‌కు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. కాగా.. ఈ ఉత్వర్తులను బీసీసీఐ హైకోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంది.

Next Story