ఎంత ప‌ని చేశావ‌మ్మా.. పిల్ల‌ల‌తో క‌లిసి చెరువులో దూకిన మ‌హిళ‌

Woman Jumped in Pond along three kids in Mahabubnagar District.ఓ మ‌హిళ త‌న ముగ్గురు చిన్నారుల‌తో క‌లిసి చెరువులోకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2022 6:19 AM GMT
ఎంత ప‌ని చేశావ‌మ్మా.. పిల్ల‌ల‌తో క‌లిసి చెరువులో దూకిన మ‌హిళ‌

కుటుంబ క‌ల‌హాల‌తో మ‌న‌స్తాపం చెందిన ఓ మ‌హిళ త‌న ముగ్గురు చిన్నారుల‌తో క‌లిసి చెరువులోకి దూకింది. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లితో పాటు ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌లు మృతి చెందారు. మ‌రో చిన్నారి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఈ విషాద ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని న‌వాబ్‌పేట మండ‌లం కాక‌ర్ల‌పాడులో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌వాబుపేట మండ‌లం కాక‌ర్ల‌పహాడ్ గ్రామానికి చెందిన మైబుకు కొత్త‌ప‌ల్లికి చెందిన ర‌మాదేవి(35)తో 13 సంవ‌త్స‌రాల క్రితం వివాహ‌మైంది. ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల క్రితం హైదారాబాద్‌కు వ‌ల‌స వెళ్లారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని అంబేడ్క‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్ల‌లు. న‌వ్య‌, క‌వ‌ల పిల్ల‌లు చంద‌న‌(4), మారుతి(4) సంతానం.

శ‌నివారం ఉద‌యం ర‌మాదేవి క‌వ‌ల పిల్ల‌లు చంద‌న, మారుతి ల‌ను తీసుకుని హైద‌రాబాద్ నుంచి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు వ‌చ్చింది. అక్క‌డి నుంచి దేవ‌ర‌క‌ద్రలో కేజీబీవీలో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్న న‌వ్య‌ను తీసుకుని న‌వాబ్‌పేట‌కు బ‌స్సులో బ‌య‌లు దేరింది. కాక‌ర్ల‌ప‌హాడ్ గ్రామానికి స‌మీపంలోనే బ‌స్సు దిగింది. చెరువు మీదుగా వెళ‌దామ‌ని పిల్ల‌ల‌కు చెప్పింది. చెరువు ద‌గ్గ‌ర‌కు వెళ్లిన త‌రువాత పిల్ల‌లు ప‌ట్టుకుని నీటిలోకి దూకేసింది. ర‌మాదేవీ, క‌వ‌ల పిల్ల‌లు మునిగిపోగా.. న‌వ్య త‌న‌కు చేతికి చిక్కిన కొమ్మ‌ను ప‌ట్టుకొని ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు, గ్రామ‌స్తులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story