ఖమ్మం నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కస్బాబజార్లోని ఓ మాల్ పక్క సందులో సుమారు 35 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని మహిళ రక్తపు మడుగులో పడి ఉంది.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోయడంతో ఆమె మృతి చెందినట్టు ఖమ్మం వన్టౌన్ ఎస్సై మౌలానా తెలిపారు. సదరు మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. అయితే మృతురాలు కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన మహిళగా తెలిసింది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. నిందతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చేతబడి, మంత్రాలు చేస్తోందనే ఉద్దేశంతో ఒక మహిళను దారుణంగా కొట్టి చంపారు. అంతేకాదు.. మరో ఇద్దరు మహిళలపైనా దాడి చేశారు. మృతురాలిని కిరణ్ దేవి (35)గా గుర్తించారు. ఈ ఘటన బిహార్లోని నవాడా జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.