ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో 18 ఏళ్ల లక్ష్మీ సరోజ్ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. లక్ష్మికి ఈ ఏడాది నవంబర్లో వివాహం నిశ్చయమైంది. అప్పటి నుండి ఆమె తన కాబోయే భర్తతో ఫోన్లో తరచుగా మాట్లాడుతూ ఉండేది. అయితే, పెళ్లికి ముందే ఇలా అతిగా మాట్లాడటం సరికాదని ఆమె తల్లి మందలించింది. తల్లి మాటలతో మనస్తాపానికి గురైన లక్ష్మి, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో శుక్రవారం దారుణం జరిగింది. మందులు కొనడానికి మార్కెట్కు వెళ్లిన 16 ఏళ్ల బాలికపై జతిన్ అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైనప్పటికీ, ఆ బాలిక ధైర్యంగా దారిన వెళ్లే వారి ఫోన్ తీసుకుని తన తల్లికి సమాచారం అందించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించింది.