మాస్కు ధ‌రించ‌లేద‌ని కాళ్లూ, చేతుల్లో మేకులు దించారు

UP woman alleges cops nailed her son's limbs.మాస్కులు ఎందుకు ధ‌రించ‌లేద‌ని ప్ర‌శ్నించి, త‌న కుమారుడితో దురుసుగా ప్ర‌వ‌ర్తించారని చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2021 1:53 AM GMT
nailed

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు ఫేస్ మాస్క్‌, శానిటైజ‌ర్‌, భౌతిక‌దూరం వంటి వాటిని త‌ప్పనిస‌రి చేశాయి. అయితే.. వీటిని కొంద‌రు పాటించ‌డకుండానే రోడ్ల‌పై తిరుగుతున్నారు. సాధార‌ణంగా మాస్కులు ధ‌రించ‌కుండా బ‌య‌ట‌కు వస్తే.. ఆయా రాష్ట్రాల్లోని నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి రూ.1000 జ‌రిమానా లేదా మూడు లేదా ఆరు నెల‌ల జైలు శిక్ష వంటివి విధిస్తున్నారు. అయితే.. కొంద‌రు పోలీసులు ఇలాంటి వారిలో బుద్ది రావాల‌ని ర‌క‌ర‌కాల శిక్ష‌ల‌ను వేస్తున్నారు. కుప్పిగంతులు వేయించ‌డం, గుంజీలు తీయించ‌డం వంటి సంఘ‌ట‌న‌లు మ‌నం చూశాం. అయితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఓ వ్య‌క్తి ప‌ట్ల అమానుషంగా వ్య‌వ‌హారించారు. అత‌డి చేతికి, కాలికి మేకులు దించారు. ఈ ఘ‌ట‌న బ‌రాద‌రీ ప్రాంతంలో జ‌రిగింది.

బాధితుడి త‌ల్లి తెలిపిన వివ‌రాల మేర‌కు.. మే 24 (సోమ‌వారం) రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో త‌న కుమారుడితో క‌లిసి ఇంటి ముందు కూర్చున్నామ‌ని.. అంత‌లో ముగ్గురు స్థానిక పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చారు. మాస్కులు ఎందుకు ధ‌రించ‌లేద‌ని ప్ర‌శ్నించి, త‌న కుమారుడితో దురుసుగా ప్ర‌వ‌ర్తించారని చెప్పింది. అంత‌లో వాగ్వాదం జ‌ర‌గ‌డంతో త‌న కొడుకును వారు తీసుకెళ్లిపోయిన‌ట్లు చెప్పింది. స్థానిక పోలీసు పోస్టు వ‌ద్దకు వెళ్లి వారిని అడిగితే.. త‌న కుమారుడిని అరెస్ట్ చేస్తామ‌ని బెదిరించార‌ని ఆమె ఆరోపించారు. మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున తీవ్ర‌గాయాలతో చేతికి, కాలికి మేకుల‌తో ద‌య‌నీయ స్థితిలో క‌నిపించిన‌ట్లు చెప్పింది.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై బుధ‌వారం ఆమె పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసింది. త‌న కొడుకుకు న్యాయం చేయాల‌ని వారిని కోరింది. కాగా.. దీనిపై సీనియ‌ర్ ఎస్పీ రోహిత్ స‌జ్వాన్ మీడియాతో మాట్లాడుతూ.. స‌ద‌రు వ్య‌క్తిపై ప‌లు పోలీసు స్టేష‌న్లలో కేసులున్నాయ‌ని తెలిపారు. ఆ కేసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికే వారు ఈ విధ‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. వారి చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌ణ‌మైన‌వ‌ని తెలిపారు.

Next Story