విషాదం.. క‌వ‌ల‌ల ఆత్మ‌హ‌త్య‌.. నిను వీడి నేనుండ‌లేను

Twin sisters end lives in Karnataka.వారిద్ద‌రు క‌వ‌ల పిల్ల‌లు. చిన్న‌నాటి నుంచి కలిసి మెలిసి ఆడుతూపాడుతూ పెరిగారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 4:21 AM GMT
విషాదం.. క‌వ‌ల‌ల ఆత్మ‌హ‌త్య‌.. నిను వీడి నేనుండ‌లేను

వారిద్ద‌రు క‌వ‌ల పిల్ల‌లు. చిన్న‌నాటి నుంచి కలిసి మెలిసి ఆడుతూపాడుతూ పెరిగారు. క‌ష్టం వ‌చ్చినా.. సంతోషం అయినా ఇద్ద‌రూ క‌లిసే వాటిని అనుభ‌వించారు. ఒక‌రికి ఒక‌రు తోడుగా ఉన్నారు. జీవితాంతం ఇలాగే ఉండాల‌ని అనుకున్నారు. వారికి పెళ్లి వ‌య‌సు రావ‌డంతో ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడ‌డం మొద‌లుపెట్టారు. అయితే.. వివాహం జ‌రిగితే తాము ఎక్క‌డ దూరం కావాల్సి వ‌స్తుందోన‌ని ఆందోళ‌న చెందారు. ఈ క్ర‌మంలోనే దారుణ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒకేసారి జ‌న్మించిన ఆ ఇద్ద‌రూ ఓకేసారి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాటక‌ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. మండ్యలోని శ్రీరంగపట్నం తాలుకాలోని మన్సహల్లి గ్రామంలో సురేష్‌, య‌శోద దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారైలు దీపిక‌, దివ్య(క‌వ‌ల పిల్ల‌లు) ఉన్నారు. క‌వ‌ల పిల్ల‌లు కావ‌డంతో స‌హ‌జంగానే వారిద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం ఉండేది. ఇద్ద‌రూ ఒకేలా డ్రెస్సులు వేసుకోవ‌డం, ఒకే త‌యారు అవ్వ‌డం, ఒకే పాఠ‌శాల‌లో చ‌దివేవారు. జీవితాంతం కూడా ఇలాగే ఉండాల‌ని క‌ల‌లు క‌నేవారు. కాగా.. వీరికి పెళ్లి వ‌య‌సు రావ‌డంతో ఇంట్లోని వారు పెళ్లి సంబంధాలు చూడ‌డం మొద‌లు పెట్టారు.

వీరిని వేర్వేరు కుటుంబాలను చెందిన వారికి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లిళ్లు అయ్యాక వేర్వేరు ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని దీపిక, దివ్యలు చాలా మ‌ధ‌న‌ప‌డ్డారు. పెళ్లి చేసుకుంటే తాము దూరం కాక త‌ప్ప‌ద‌ని బావించారు. ఈక్ర‌మంలోనే దారుణ నిర్ణ‌యం తీసుకున్నారు. శ‌నివారం సాయంత్రం ఇంట్లో ఎవ‌రూ లేని సమ‌యంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. అయితే.. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో సోమ‌వారం ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story