ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బ‌స్సును ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మ‌ర‌ణం

హ‌ర్యానా రాష్ట్రంలో బ‌స్సును లారీ ఢీ కొట్ట‌డంతో 8 మంది దుర్మ‌ర‌ణం చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2023 8:11 AM GMT
Road accident, Haryana

ప్రతీకాత్మక చిత్రం

హ‌ర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి ప్ర‌యాణీకుల‌తో ఓ బ‌స్సు హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీకి బ‌య‌లు దేరింది. అయితే.. హ‌ర్యానా రాష్ట్రంలోని అంబాలాలోని కక్కర్ మజ్రా గ్రామానికి సమీపంలోని పంచకుల యమునానగర్ జాతీయ రహదారిపై ఓ ముగ్గురు ప్ర‌యాణీకులు దిగేందుకు బ‌స్సును ఆపారు. అదే స‌మ‌యంలో ఓ లారీ బ‌స్సును ఢీ కొట్టింది. 8 మంది అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను అంబాలా సిటీ, నరైన్‌గర్‌లోని సివిల్‌ ఆసుపత్రుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. బ‌స్సులో చాలా మంది నిర్మాణ ప‌నులు చేసేట‌టువంటి వ‌ల‌స కూలీలేన‌ని పోలీసులు తెలిపారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లారీ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story