దారుణం.. ఇంట్లో 15 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు

తమిళనాడులోని రాణిపేట జిల్లాలో బుధవారం 15 ఏళ్ల బాలికను ఇంట్లో కత్తితో పొడిచి చంపి, ఆమె బంధువును తీవ్రంగా గాయపరిచాడో వ్యక్తి.

By అంజి
Published on : 29 May 2025 12:38 PM IST

Teen girl, murder, cousin injured, Tamil Nadu, home, Crime

దారుణం.. ఇంట్లో 15 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు

తమిళనాడులోని రాణిపేట జిల్లాలో బుధవారం 15 ఏళ్ల బాలికను ఇంట్లో కత్తితో పొడిచి చంపి, ఆమె బంధువును తీవ్రంగా గాయపరిచాడో వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు జనని తన బంధువు లక్ష్య, అమ్మమ్మతో కలిసి పులివలం గ్రామంలోని తన ఇంట్లో ఉండగా, ఆమె తండ్రి, నేత కార్మికుడు అయిన జెగత్కుమార్ పనికి వెళ్ళాడు. లక్ష్య వేసవి సెలవుల నేపథ్యంలో జనని వద్దకు వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మమ్మ వాటర్ ట్యాంక్‌ను తనిఖీ చేయడానికి పైకి వెళ్ళినప్పుడు, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి లోపలి నుండి తలుపు గడియ వేశాడు. జనని సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది, కానీ ఆగంతకుడు ఆమెను అనేకసార్లు పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. లక్ష్య జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమెపై కూడా దాడి జరిగింది. తీవ్రంగా గాయపడింది.

వారి అరుపులతో అప్రమత్తమైన పొరుగువారు తలుపులు పగలగొట్టి, దుండగుడిని పట్టుకుని, పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని 20 ఏళ్ల సుబ్రమణిగా గుర్తించారు. స్థానికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. జనని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా, లక్ష్య పరిస్థితి విషమంగా ఉంది. దాడికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. పాళయం పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story