గుంటూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హ‌త్య‌

TDP Leader brutally killed in Guntur District.గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గురువారం తెలుగుదేశం పార్టీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 4:40 AM GMT
గుంటూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హ‌త్య‌

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గురువారం తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య‌కు గుర‌య్యాడు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ పార్టీ నాయ‌కుడు తోట చంద్ర‌య్య(36)ను ప్ర‌త్య‌ర్థులు న‌రికి చంపారు. వివ‌రాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తోట చంద్ర‌య్య‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. చంద్ర‌య్య పై ఆగ్ర‌హాంతో ఊగిపోతున్న ప్ర‌త్య‌ర్థులు అత‌డి అడ్డుతొల‌గించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో ప‌ని నిమిత్తం చంద్ర‌య్య‌ బైక్ పై ఇంటి నుంచి బ‌య‌లుదేరాడు. అప్ప‌టికే అత‌డి కోసం కాపు కాచిన ప్ర‌త్య‌ర్థులు బైక్‌కు క‌ర్ర అడ్డుపెట్టి కింద‌పడేలా చేశారు. అనంత‌రం చంద్రయ్య కింద ప‌డ‌గానే క‌త్తులు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి హ‌త‌మార్చారు. హ‌త్య అనంత‌రం ప్ర‌త్య‌ర్థులు అక్క‌డి నుంచి ప‌రారు అయ్యారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా గ‌స్తీ ఏర్పాటు చేశారు. ఈ హత్య రాజకీయ కోణంలో జరిగిందా? లేక పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. గ్రామంలో ఆదిప‌త్య పోరుకోస‌మే ఈ హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Next Story