గుడిసె అంటుకొని 6గురు చిన్నారులు సజీవ దహనం

Six children burnt alive-straw house catches fire. నిప్పు రవ్వలు ఎగిరి పడి పూరి గుడిసె అంటుకుంది. దీంతో ఆరుగురు చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు.

By Medi Samrat  Published on  31 March 2021 1:58 AM GMT
six children burnt alive

సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుని తినాలనుకోవడమే వారి పాలిట శాపమైంది. నిప్పు రవ్వలు ఎగిరి పడి పూరి గుడిసె అంటుకుంది. దీంతో అభం శుభం తెలియని ఆరుగురు చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు. మనసును కలిచివేసే ఈ దుర్ఘటన బీహార్‌లోని అరారియా జిల్లా చోటుచేసుకుంది.

అరారియా జిల్లా కబయా గ్రామంలో మంగళవారం చిన్నారులు మొక్కజొన్న కంకులు కాల్చుకుని తినేందుకు నిప్పుల కుంపటి రాజేశారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా ఆ మంటలు పూరి గుడిసెపై పడ్డాయి. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండాపోయింది.

ఆ పిల్లల కేకలు విన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు దట్టంగా అలుముకోవడంతో ఆ ఆ ప్రయత్నం వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. పూరి గుడిసె తగలబడిందన్న సంగతి తెలిసిన వెంటనే వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పలసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తరం ఆస్పత్రికి తరలించారు.మృతులంతా 3 నుంచి ఆరేళ్లు లోపు చిన్నారులే కావడం అందరినీ కలిచివేస్తోంది. ఇక ఆ చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో పిల్లలందరూ ఒకే దగ్గర చేరినట్లు తెలుస్తోంది.


Next Story