పెళ్లింట అంతులేని విషాదం

SI sudden death after hearing his mother death.పెళ్లింట తీవ్ర విషాదం నెల‌కొంది. వివాహా తంతు ముగిసిన కాసేప‌టికే వ‌రుడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 5:01 AM GMT
పెళ్లింట అంతులేని విషాదం

పెళ్లింట తీవ్ర విషాదం నెల‌కొంది. వివాహా తంతు ముగిసిన కాసేప‌టికే వ‌రుడి నాయ‌న‌మ్మ క‌న్నుమూసింది. విష‌యం తెలిసిన ఆమె కుమారుడు గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఒకే సారి వ‌రుడి.. నాన్న‌, నాయ‌న‌మ్మ ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆ పెళ్లింట అంతులేని విషాదం నెల‌కొంది. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా బుక్క‌రాయ స‌ముద్రం మండ‌లంలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. శనివారం ఆయ‌న కుమారుడు గోవ‌ర్థ‌న్ వివాహం దేవ‌ర‌కొండ ఆల‌యం వ‌ద్ద ఉన్న టీటీడీ క‌ళ్యాణ‌మండ‌పంలో వైభ‌వంగా జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, బంధువులు, పోలీసు శాక సిబ్బంది వివాహానికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

మ‌రోవైపు వెంక‌ట‌స్వామి త‌ల్లి కోన్న‌మ్మ‌(70) మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఓ ఆస్ప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో వివాహాన్ని వాయిదా వేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో శ‌నివారం వివాహాన్ని జ‌రిపించారు. పెళ్లి తంతు ముగిశాక తల్లిని చూసేందుకు వెంక‌ట‌స్వామి ఆస్ప‌త్రికి వెళ్లాడు. అప్ప‌టికే ఆమె మృతి చెందిందన్న వార్త తెలిసింది. అది విన్న వెంట‌నే వెంక‌ట‌స్వామి కుప్ప‌కూలిపోయారు. గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఇద్ద‌రి మృతితో ఆ పెళ్లింట విషాదం నెల‌కొంది.

Next Story