పెళ్లింట విషాదం : బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

Seven killed, many injured in road accident in Kanhangad. పెళ్లింట విషాదం,కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడిన‌ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

By Medi Samrat
Published on : 4 Jan 2021 11:27 AM IST

road accident in Kanhangad

పెళ్లింట విషాదం నెల‌కొంది. కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడిన‌ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వివరాళ్లోకెళితే.. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని పెళ్లి కూతురు ఇంటి నుంచి.. వరుడుతో పాటు బంధుమిత్రులు సుమారు 60 మందితో కూడిన‌ బస్సు కొడగు జిల్లాలోని వరుని ఇంటికి బయల్దేరింది.

మార్గ‌మ‌ధ్యంలో కేరళలోని కాసరగోడ్‌ జిల్లా పాణత్తూర్‌ మీదుగా ప్రయాణిస్తుండగా.. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతో అదుపు తప్పిన బ‌స్సు రోడ్డు పక్కన ఉన్న ఓ పెంకుటిల్లుని ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తరువాత చనిపోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మృతులు రాజేశ్, రవిచంద్ర, ఆదర్శ్, శ్రేయస్, సుమతి, శశి, జయలక్ష్మీ గా గుర్తించారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. ఇక గాయపడినవారిని కాసరగోడ్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ కొడగు జిల్లాకు చెందినవారేనని తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై కేరళ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గ‌ల‌ కారణాలపై విచారణ చేయాలని ఆదేశించారు.


Next Story