ఎల్బీనగర్ వంతెనపై రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరి కిందపడి యువకుడి మృతి
Road accident in LB Nagar I ఎల్బీనగర్ వంతెనపై రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరి కిందపడి యువకుడి మృతి
By సుభాష్
ఎల్బీనగర్ వెంతెనపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాలానగర్ సమీపంలో పతేనగర్కు చెందిన ఉదయ్ రాజ్ (20) తన బంధువు అనుషకు డిగ్రీ పరీక్షలు ఉండటంతో ఆమెను పరీక్ష కేంద్రం వద్ద దించాడు. పరీక్ష అనంతరం సంఘీ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆమెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎల్బీనగర్ వైపు బయలుదేరాడు.
ఈ క్రమంలో మధ్యాహ్నం ఎల్బీనగర్ వంతెనకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టింది. దీంతో ఉదయ్రాజ్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి 20 అడుగుల పై నుంచి కిందపడ్డాడు. దీంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే ప్రమాదానికి కారణమైన కారు వీరి ముందున్న మరో ద్విచక్ర వాహనాన్ని సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికి తవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని పలువురు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు నగరంలో ఎన్నో జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి అరికట్టేందుకు నగర పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి రోజు ఒక్కడో ఓ చోటు జరుగుతూనే ఉన్నాయి.