చేతబడి చేస్తున్నారని అనుమానం.. నిద్రలోనే భార్య భర్తలను నరికి చంపారు

Odisha couple hacked to death on suspicion of practising ‘witchcraft’. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో 45 ఏళ్ల వ్యక్తి, అతని భార్యను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు.

By అంజి
Published on : 12 Dec 2022 2:30 PM IST

చేతబడి చేస్తున్నారని అనుమానం.. నిద్రలోనే భార్య భర్తలను నరికి చంపారు

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో 45 ఏళ్ల వ్యక్తి, అతని భార్యను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. భార్య భర్తలు చేతబడి చేశారనే అనుమానంతో ఈ జంట హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం దైతరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ జుముకిపాటియా సాహి గ్రామంలో వారి ఇంటి బయట రక్తపు మడుగులో భార్య భర్తల మృతదేహాలు కనిపించాయి. "ఈ హత్యల వెనుక మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని కియోంజర్ పోలీసు సూపరింటెండెంట్ మిత్రభాను మహాపాత్ర తెలిపారు.

బహదా ముర్ము (45), అతని భార్య ధని (35) రాత్రి భోజనం చేసి ఇంటి బయట నిద్రిస్తుండగా శనివారం ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు అర్ధరాత్రి సమయంలో వారి ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో దంపతుల తలపై కొట్టారు. అనంతరం దంపతులకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి పారిపోయారు.

తన తండ్రి బహదా ముర్ము, తల్లి ధని శనివారం రాత్రి తమ ఇంటి గది బయట నిద్రిస్తున్నారని దంపతుల కుమార్తె సింగో తెలిపారు. "నేను ఒక గదిలో నిద్రిస్తున్నాను. కేకలు విని బయటకు వచ్చి చూడగా నా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు" అని సింగో చెప్పింది. ఆమె తన మామ కిసాన్ మరాండీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. "నాకు సింగో నుండి అర్ధరాత్రి 12:30 గంటలకు కాల్ వచ్చింది. నేను, నా పెద్ద కొడుకుతో కలిసి మోటార్ సైకిల్‌పై గ్రామానికి చేరుకున్నాము" అని మరాండి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story