త‌ల్లి మృత‌దేహాన్ని 5 ముక్క‌లు చేసిన కూతురు.. దుర్వాస‌న రాకుండా ఎయిర్ ఫ్రెన‌ర్లు

త‌ల్లి మృత‌దేహాన్ని ఐదు ముక్క‌లు చేసింది కూతురు. మృత‌దేహం ముక్క‌లు ఇంట్లోనే ఉండ‌డం వ‌ల్ల దుర్వాస‌న బ‌య‌ట‌కు రాకుండా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2023 6:39 AM GMT
woman cut her mother’s body into five pieces,Mumbai

రింపుల్‌ను అరెస్ట్ చేసి తీసుకువెలుతున్న పోలీసులు

ఇటీవ‌ల కాలంలో కొంద‌రు దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి పెంచిన త‌ల్లి మెట్ల పై నుంచి కింద ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమెను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాల్సిన కూతురు ఆ ప‌ని చేయ‌లేదు. రెండు రోజులు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించిన త‌ల్లి క‌న్నుమూసింది. విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తే త‌న‌ను ఎక్క‌డ అరెస్ట్ చేస్తారోన‌ని భ‌య‌ప‌డిన కూతురు త‌ల్లి మృత‌దేహాన్ని ఐదు ముక్క‌లు చేసింది. వాటిని ఇంట్లోనే ఉంచింది. రెండు నెల‌లుగా మృత‌దేహం ముక్క‌లు ఇంట్లోనే ఉండ‌డం వ‌ల్ల దుర్వాస‌న బ‌య‌ట‌కు రాకుండా టీ ఆకులు, ఫినాయిల్‌, 40 బాటిళ్ల ఎయిర్ ఫ్రెష‌నర్లు ను ఉప‌యోగించింది. నేరం బ‌య‌ట ప‌డ‌డంతో కూతురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న ముంబైలో జ‌రిగింది.

ముంబైలోని లాల్‌బాగ్ చాల్‌లో వీణా ప్ర‌కాష్ జైన్(55), ఆమె కూతురు రింపుల్(23) లు క‌లిసి నివ‌సిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 27న తల్లి వీణ తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి పడిపోయింది. తమ ఇంటి కింద ఉన్న చైనీస్ తినుబండారంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు వీణను ఇంటికి తీసుకురావడానికి సహాయం చేసిన‌ట్లు రింపుల్ పోలీసుల‌కు తెలిపింది.

త‌ల‌కు మాత్ర‌మే కాకుండా శ‌రీరంలో చాలా చోట్ల వీణ‌కు గాయాలు అయ్యాయి. అయితే.. రింపుల్ ఆమెను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌క‌పోవ‌డంతో రెండు రోజులు నొప్పుల‌తో అల్లాడిపోయిన వీణ త‌న ఇంట్లోనే మ‌రణించింది. ఈ విష‌యం బ‌య‌ట తెలిస్తే.. త‌ల్లిని తానే హ‌త్య చేసిన‌ట్లు అంద‌రూ అనుకుంటార‌ని బావించింది రింపుల్‌. అవశేషాలను పారవేసే మార్గాల కోసం ఇంటర్నెట్‌లో వెతికింది.

లాల్‌బాగ్ మార్కెట్ సమీపంలోని దుకాణం నుండి ఆమె ఎలక్ట్రిక్ మార్బుల్ కట్టర్‌ను కొనుగోలు చేసిందని పోలీసులు తెలిపారు. త‌ల్లి మృత‌దేహాన్ని ఐదు ముక్కలుగా క‌త్తిరించింది. ఆ భాగాల‌ను ఇంట్లోనే ఉంచింది. ఇరుగుపొరుగు వారికి దుర్వాస‌న రాకుండా ఎయిర్ ఫ్రెషనర్లు, ఫినైల్, టీ పౌడర్‌లను ఉప‌యోగించింది.

హత్య వెనుక గల కారణాలను పోలీసులు ఇంకా కనుగొనలేకపోయారు, అయితే తల్లి, కుమార్తె ల మధ్య తరచుగా గొడవలు జరిగేవ‌ని తెలిసింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు శుక్రవారం 27 ఏళ్ల యువకుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ వ్యక్తిని కొన్ని గంటలపాటు విచారించిన తర్వాత వెళ్లేందుకు అనుమతించారు.

రింపుల్‌తో టచ్‌లో ఉన్నందున అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి కాలాచౌకీ పోలీసుల బృందం ఆ వ్యక్తిని లక్నో నుండి తీసుకు వ‌చ్చార‌ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీణ కింద‌ప‌డిపోయిన త‌రువాత ఆమెను ఇంటికి తీసుకురావ‌డానికి సాయం చేసిన ఇద్ద‌రు వ్య‌క్తుల్లో అత‌డు ఒక‌డ‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు రింపుల్ ను అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story