ఒంగోలులో దారుణం.. వాహ‌నంతో ఢీ కొట్టి.. వివాహిత‌పై సామూహిక అత్యాచారం

Married women molested by two men in Ongole.వివాహిత‌పై ఇద్ద‌రు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2022 4:57 AM GMT
ఒంగోలులో దారుణం.. వాహ‌నంతో ఢీ కొట్టి.. వివాహిత‌పై సామూహిక అత్యాచారం

ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల‌పై దారుణాలు పెరిగిపోతున్నాయి. ఉపాధి కోసం నిత్యం ద్విచ‌క్ర‌వాహ‌నంపై పొరుగూరికి వెళ్లే వివాహిత‌పై ఇద్ద‌రు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగింది. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు రోజూ ఒంగోలు ప‌ట్ట‌ణానికి దిచ‌క్ర‌వాహ‌నంపై వ‌చ్చి కూర‌గాయ‌లు అమ్ముకుని తిరిగి స్వ‌గ్రామానికి వెలుతుంది. రోజులాగే మంగ‌ళ‌వారం కూడా కూర‌గాయాలు అమ్ముకుని తిరిగి ఇంటికి వెలుతుండ‌గా రాత్రి ప‌దిన్న‌ర గంట‌ల స‌మ‌యంలో కొప్పోలు-గుత్తికొండ‌వారిపాలెం గ్రామాల మ‌ధ్య ఇద్ద‌రు యువ‌కులు బైక్‌పై ఆమెను వెంబ‌డించారు.

ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె వాహ‌నాన్ని ఢీ కొట్టారు. కింద‌పడిన ఆమెను ప‌క్క‌నే ఉన్న పొద‌ల్లోకి లాక్కెళ్లారు. ఆమె ఎంత‌గా ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. అత్యాచారానికి పాల్ప‌డిన దుండ‌గులు ఆమెను అక్క‌డే వదిలివేసి ప‌రారు అయ్యారు. ఎంత‌సేప‌టికీ మ‌హిళ ఇంటికి రాక‌పోవ‌డంతో ఆమె కుటుంబ స‌భ్యులు బాధితురాలిని వెతుకుంటూ వ‌స్తుండ‌గా.. దారిలో వారికి బాధితురాలు క‌నిపించింది.

జ‌రిగిన దారుణాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్పింది. వారు నిందితుల కోసం గాలిస్తుండ‌గా.. కొత్త‌ప‌ట్నం రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వ‌ద్ద నిందితులు క‌నిపించారు. వారిని ప‌ట్టుకునే లోపే అక్క‌డి నుంచి వారు ప‌రారు అయ్యారు. మ‌రుస‌టి రోజు బుధ‌వారం రాత్రి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కొప్పోలు స‌మీపంలోని చేప‌ల చెరువుల వ‌ద్ద కాపలాదారులుగా ప‌ని చేస్తున్న ఇద్ద‌రు యువ‌కులే ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు.

Next Story