దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలో ఒక వ్యక్తి తన మైనర్ కుమార్తె కళ్లెదుటే భార్యను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బినోద్ సింగ్ మద్యం సేవించి తరచుగా తన భార్య స్వప్న సింగ్ను డబ్బుల కోసం వేధించేవాడు. సొంత సంపాదన లేని బినోద్, భార్య కష్టపడి సంపాదించిన డబ్బును డిమాండ్ చేస్తూ గొడవ పడేవాడని, చివరకు ఆమె పనిచేసే చోట కూడా గొడవలు చేసి ఆమె ఉద్యోగం పోవడానికి కారణమయ్యాడని స్థానికులు ఆరోపించారు.
శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన బినోద్, భార్యను రూ. 4,000 ఇవ్వాలని కోరగా, ఆమె నిరాకరించడంతో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున వచ్చి తలుపు తట్టగా, కుమార్తె తలుపు తీసింది. ఆ సమయంలో నిద్రిస్తున్న స్వప్నపై బినోద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళ అరుపులు విని అక్కడికి చేరుకున్న పొరుగువారు పారిపోతున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన స్వప్నను చిత్తరంజన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కస్బా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ప్రాథమికంగా కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నప్పటికీ, ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.