11 ఏళ్ల కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. కారణమదేనన్న పోలీసులు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం 11 ఏళ్ల కుమార్తె రజితను ఆమె తండ్రి దారుణంగా హత్య చేశారు.
By అంజి Published on 12 May 2023 7:30 AM IST
దారుణం.. 11 ఏళ్ల కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం 11 ఏళ్ల కుమార్తె రజితను ఆమె తండ్రి దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో ఈ దారుణ హత్య జరిగింది. భార్యను గొంతుకోసి హత్య చేసి జైలుకు వెళ్లిన బట్టుపల్లిలో గుండ్ల సదానందం ఇటీవల ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం గొడ్డలి తీసి కూతురిపై దాడి చేసి నరికి చంపాడు. అనంతరం ఆ ప్రాంతంలోని ఓ దుకాణదారుడిపై దాడి చేశాడు. ఈ దారుణమైన దాడి గ్రామంలో కలకలం రేపింది. సదానందం మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సదానందంను అదుపులోకి తీసుకున్నారు.
అతడిని పోలీసులు తీసుకెళ్తుండగా గ్రామస్థులు కారు ఆపి నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులను కోరారు. అతడిని శిక్షిస్తామని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగారు. అయితే, పోలీసులు గుంపును నియంత్రించి, ఆగ్రహించిన స్థానికులను చెదరగొట్టి, ప్రశాంతతను పునరుద్ధరించారు. అయితే సైకోలా వ్యవహరిస్తున్న సదానందం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.